బామ్మ(అమ్మ) - గృహవైద్యం

 బామ్మ(అమ్మ) - గృహవైద్యం 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                                 బామ్మ రకరకాల చిట్కాలు చెప్పేది.  చిట్కా వైద్యం చేసేది. చిట్కా వైద్యం అంటే గృహ వైద్యం అన్నమాట. అమ్మో, వాటికి లెఖ్ఖ లేదు, అంతూ దరీ ఉండేది కాదు. ఊ అంటే ఒక వైద్యం, ఆ అంటే ఒక వైద్యం. అవేమీ పని చెయ్యకపోతే, హోమియో మందులు, ఫెర్రమ్ ఫాసూ, కాలీ ఫాసూ అంటూ. బహుశా అందుకేనేమో చిన్నప్పుడు ఎప్పుడూ హాస్పిటల్ కి వెళ్లిన గుర్తు లేదు. ఇవాళ మా బామ్మా, అమ్మా ఇద్దరూ చేసిన చిట్కా వైద్యం గురించి చెప్తా. చదవటానికి విసుగ్గా అనిపిస్తుందేమో గానీ వాడటానికి అద్భుతంగా ఉంటాయి. మంచి ఫలితం కూడా చూపిస్తాయి. మాకు మాత్రం చేసేటప్పుడు కొన్ని మహా హుషారుగా అనిపించేవి. చాలా పోజుగా కూర్చుని మరీ చేయించుకునే వాళ్ళం. కొన్ని చెప్తే చాలు, భయపడి పారిపోవడానికి ట్రై చేసేవాళ్ళం, కానీ బామ్మకో, అమ్మకో దొరికిపోయేవాళ్ళం. పిల్లలున్న ఇళ్లల్లో ఇలాంటి పెద్దలుంటే యెంత ఉపయోగమో, యెంత పొదుపో, యెంత ఆరోగ్యమో.

                                                    ఎవరైనా కడుపునొప్పి అంటే చాలు, మూడు నాలుగు రకాల చిట్కాలు వాడేది. కడుపు ఉబ్బరంగా ఉంటే, అంటే కడుపులో ఏదో తెలియని అనీజీగా ఉంటే, జీలకర్ర పంచదార కలిపి నములుతూ ఆ జ్యూస్ ని నెమ్మదిగా మింగమనేది. జీలకర్ర కొంచెం ఘాటుగా ఉండేది. ఇష్టం లేకుండా నమిలేవాళ్ళం, కానీ తరువాత మాత్రం హాయిగా ఉండేది. ఒక్కోసారి పంచదార ఎక్కువ, జీలకర్ర తక్కువ వేసుకోవటానికి వేషాలేసేవాళ్ళం కానీ, అమ్మ లెక్కపెట్టి సమానంగా రెండూ, చెరో చెంచా చేతిలో వేసేది. కడుపు మంట అంటే మాత్రం, చక్కగా పేర్నెయ్యి, పంచదార ఒక స్పూన్ లో చక్కగా రెండూ కలిపి పేస్ట్ గా చేసి నాకమనేవాళ్ళు. ఇది మాత్రం మా పిల్లలకు అద్భుతంగా ఉండేది. ఒక్కోసారి ఇది తినటానికి, దొంగ కడుపు మంట కూడా చెప్పేవాళ్ళం. కడుపు నొప్పి వస్తే ఆముదం చేతులకు రాసుకుని పొయ్యి మీద వేడి చేసి, పొట్టమీద బొడ్డు దగ్గర, ఓ పది పదిహేను సార్లు కాపడం పెట్టేవాళ్ళు. వేడి వేడిగా పొట్టమీద దోసెలేస్తున్నట్టు, భలే ఉండేది. నొప్పి మాత్రం మాయమై పోయేది. తలనొప్పి అంటే మాత్రం శొంఠి గంధం పట్టు వేసేది. శొంఠికొమ్ము సాన మీద అరగదీసి, గంధం తీసి, కణతలకి చక్కగా రాసేవాళ్ళు. మంట మంటగా ఉండేది గానీ తలనొప్పి మాత్రం ఆ మంటతోనే పోయేది.  ఒళ్ళు నొప్పులంటే, ఉప్పుకాపు పెట్టేవాళ్ళు. అంటే ఉప్పుని వేయించి, ఒక బట్టలో మూటకట్టి ఆ వేడి మూటతో, ఎక్కడ నొప్పంటే, అక్కడ కాపడం పెట్టేవాళ్ళు.

                                                     నోటికి  రుచి పోతే  జీలకర్ర కషాయం కానీ, మిరియాల కషాయం కానీ, ధనియాల కషాయం కానీ కాచి తాగించే వాళ్ళు. కాషాయమంటే ఏం లేదు. ధనియాలు కానీ జీలకర్రను కానీ, మిరియాలను కానీ కొంచెం దంచి పొడి చేయటం, ఆ పొడిని నీళ్ళల్లో వేసి మరిగించటం, తోడుగా కొంచెం బెల్లమో, తేనో, అదీ లేకపోతే పంచదారో వేసి కలిపి ఓ మూడు నాలుగు గుక్కెళ్ళు తాగించటం. చచ్చే కారంగా వుంటాయన్నీ. అరుదుగా అల్లం ముక్క కడిగి ఉప్పు రాచి, నిప్పుల్లో పొంగించి, దాన్ని చల్లారాక నోట్లో వేసుకుని చప్పరించమనేది. ఇది కూడా కారంగానే ఉండేది కానీ, రుచిగానే ఉండేది. ఇంకా ఎవరైనా ఉడుకు విరేచనాలవుతున్నాయంటే, మొదట్లో నీళ్ళల్లో పంచదార వేసుకుని తాగమనేది. ఈ వైద్యం మాత్రం చిన్నా, పెద్దా అందరికీ మహా నచ్చేది. అటొచ్చి ఓ సారీ, ఇటొచ్చి ఓ సారీ ఎంచక్కా పంచదార కలుపుకుని నీళ్లు తాగేసేవాళ్ళం. ఇంకోసారి సబ్జాగింజలు పంచదార నీళ్ళల్లో నానేసి తాగమనేది. ఇది కూడా చాలా బాగుండేది. ఒక్కోసారి ఓ గరిటెడు పెరుగులో ఓ అరచెంచాడు మెంతులు వేసి మింగమనేది. ఆ వేడికి ఈ మెంతులు చలవట. అప్పటికీ తగ్గకపోతే కాస్త సగ్గుబియ్యం జావ కాచి కొంచెం పాలూ, పంచదారా వేసిచ్చి తాగమనేది. ఇది అద్భుతమైన మందు. మాకందరికీ బాగా నచ్చిన సగ్గుబియ్యం పాయసం మందు. దీంతో ఆ విరేచనాలు ఠక్కున కట్టేవి. మొత్తం మీద మేము డాక్టర్ల దగ్గరకు వెళ్ళటం తక్కువే. 

                                                  పొడి దగ్గు వస్తే పటికబెల్లం బుగ్గన పెట్టుకుని నెమ్మదిగా ఆ జ్యూస్ ని మింగమనేది. అప్పుడు మాత్రం బామ్మ తన పెట్టెలోంచి తేనె సీసా తీసేది. కఫంతో వస్తున్న దగ్గుకి తేనె నాకమనేవారు. ఇది కూడా బామ్మ దగ్గర రెడీగా ఉండేది. ఒక్కోసారి దగ్గు సతాయిస్తుంటే మాత్రం, ఓ చుక్క నెయ్యిలో లవంగాలు పొంగించి పటికబెల్లంతో కలిపి పొడి చేసి కొంత పొడి బుగ్గన పెట్టుకోవడం ఓ పద్ధతి. మా బామ్మ ఎప్పుడూ ఈ పొడి చేయించి దగ్గర పెట్టుకునేది. ఇది మా అత్తగారికి కూడా చాలా నచ్చింది. ఆవిడ కూడా ఎప్పుడూ ఈ పొడి చేయించుకుని దగ్గర పెట్టుకునేది. దగ్గుకి బాగా ఉపశమనంగా వుంది అనేది మా అత్తగారు. ముక్కుదిబ్బడ కి మిరియం గింజని ఒక పిన్నుకి కాల్చి పొగ పీల్చమనేది. ఆ పొగ మహా ఘాటుగా ఉండేది. చుర్రుమనేది. కానీ ముక్కుకి వెంటనే ఉపశమనం కలిగేది. ఒక్కసారిగా ఊపిరి ఆడి హాయిగా ఉండేది. జలుబుకు కూడా బామ్మ దగ్గర రకరకాలైన ఉపాయాలు ఉండేవి. అవి అమ్మ ద్వారా చేయించేది. అమ్మ చేత వేడి నీళ్లు సలసలా కాగించి మూత పెట్టి ఆ ఆవిరి పోకుండా ఆ గిన్నెని జాగ్రత్తగా తెచ్చి దాంట్లో పసుపో, అమృతాంజనమో కొంచెం వేసి ఆవిరి పట్టించేవాళ్ళు. బామ్మయితే పక్కనే కూర్చుని, మొద్దు మొద్దు దుప్పట్లు కప్పి ఊపిరాడకుండా ఆవిరి పట్టించేది. అప్పుడు మాత్రం లబోదిబో మనే వాళ్ళం. బామ్మ మాత్రం వదిలేది కాదు. మా తమ్ముడు, బాబు అంటాం, చాలా చిన్నప్పుడు ఒకసారి మా చెల్లెళ్లు పద్మకీ, భారతికీ ఆట కోసం, అమాయకంగా వాళ్ళిద్దరి కళ్ళల్లో అమృతాంజనం పెట్టేసాడు. ఇక చూడండి, వాళ్లిద్దరూ మంటో, మంటో అంటూ పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టారు. బాబు తెల్లబోయాడు. వాడూ ఏడవటం మొదలు పెట్టాడు. అమ్మ, బామ్మా పరుగెత్తుకు వచ్చారు. విషయం అర్ధం అవగానే, బాబుకి రెండు తగిలించి ఇద్దరూ చల్లనీళ్ళతో  చెరొకరికి కళ్ళు కడగటం మొదలుపెట్టారు. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఇంకా నయం, ఆ టైం కి నేను ఇంట్లో లేను. బతికి పోయాను. అప్పుడే ఇంట్లోకి వస్తున్నాను, వీళ్ళిద్దరూ ఘొల్లుమని ఏడుపు మొదలుపెట్టారు. తరువాత ఇద్దరికీ కాసేపు చల్లటి తడిబట్ట వేసి పడుకో పెట్టారు. తరువాత  నవ్వుకున్నా, అప్పుడు మాత్రం అందరం చాలా ఖంగారు పడ్డాం. 

                                                 నాన్నకు కాలికి ఆనెలు ఉండేవి. పాపం చాలా బాధపడేవాడు. ఆ పోలిక పాపం భారతికి కూడా వచ్చింది. బామ్మ ఇటుక ముక్క కాల్చి, కాలి ఆనె కి కాపడం పెట్టేది. చురుక్కుమంటూ ఉండేది. నేను కూడా పెళ్లయ్యాక, మావారికి ఆ ప్రాబ్లమ్ వస్తే, నేనూ ఇటుక కాపు పెట్టేదాన్ని. ఒక చిన్న ఇటుక ముక్కని మంట మీద కాల్చి, జాగత్తగా కింద పెట్టి, కూర్చుని దానిమీద పాదం పెడుతూ, తీస్తూ ఉండమనేదాన్ని. అప్పటికప్పుడు కాస్త నొప్పి తగ్గేది. అమ్మ ఎప్పుడూ ఏదో పని మీద ఎక్కువగా నీళ్ళల్లోనే ఉండేది. పాదాలు ఎప్పుడూ తడిగానే ఉండేవి. అమ్మ చర్మం చాలా సున్నితంగా ఉండేది. దాంతో అమ్మకి కాళ్ళు బాగా పాసేవి. నాన్నకేమో, ఎప్పుడూ వేడి తత్వం, పాదాలు పగిలేవి. అమ్మకేమో, కొబ్బరి నూనెలో పసుపు కలిపి, ఆ పేస్ట్ ని పాదాలకి, ముఖ్యంగా వేళ్ళ మధ్య రాసుకోమనేది. నాన్నకేమో అదే నూనెలో బోరిక్ పౌడర్ కలిపి ఆ పేస్ట్ ని కాళ్ల పగుళ్ళకి పట్టించేది అమ్మ. ఓ వారం రోజులు ఇలా రాసుకుంటే, ఆ సమస్య మాయమై పోయేది. ఆడవాళ్ళకు గైనిక్ సమస్యలుంటే, చిట్టుడుకు నీళ్లులో ఉప్పు వేసి తాగమనే వారు. చిట్టుడుకు నీళ్లంటే, అన్నం ఎసరు పెట్టి, కాసేపు ఉడికాక, ఆ నీళ్లు కొంచెం తీసుకుని, దాంట్లో కాస్త ఉప్పు వేసి,  గోరు వెచ్చగా తాగటం ఒక పధ్ధతి. ఇంకోటి బియ్యం కడుగునీళ్లు తాగటం, అంటే బియ్యాన్ని ఒకసారి పైపైన కడిగి ఆ నీళ్లు పారబోసి, రెండోసారి కడిగినప్పుడు, ఆ నీళ్లు కొంచం తీసుకుని దాన్ని తాగేవాళ్ళు. ఆ నీటిలో కొంచం తవుడు కూడా ఉండాలి, అది నియమం.  వంట చేస్తున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా కాలితే చల్లగా నవనీతం రాసుకోమనేది. లేకపోతే తనే రాసేది. తాను రాయటమా, మనమే రాసుకోవటమా అనేది, ఆవిడ ఆ సమయంలో మడిలో ఉందా, లేదా అనే దానిమీద ఆధారపడేది. ఇంతకీ నవనీతం అంటే అప్పటికప్పుడు తీసిన వెన్న కాదు. అది ఎప్పుడంటే అప్పుడు రెడీ గా ఉండొద్దూ. బామ్మే చక్కగా నవనీతం చేసేది. కొద్దిగా పేర్నెయ్యి ఒక ప్లేట్ లో తీసుకుని, నాలుగు చుక్కలు నీళ్లు వేసుకుని చక్కగా కలిపేది. యెంత కలిపితే అంత బాగా తెల్లగా అది వెన్న లాగా వచ్చేది. ఆ పేస్ట్ ని కాలిన చోట రాసేది. చల్లగా హాయిగా ఉండేది. ఈనాటి మన బర్నాల్ లాగానో, డ్రెసిన్ లాగానో పనిచేసేది. ఆ మంటా పోయేది. కాలిన గాయం మానేదాకా అదే చికిత్స, అంతే. ఇంకో చిట్కా, ఎక్కిళ్ళొస్తే, గబగబా గ్లాసుడు నీళ్లు ఆపకుండా తాగించేది. నాన్నకేమో ఎక్కిళ్ళొస్తే ఆగేవి కావు. ఒక్కోసారి నాన్నకి ఎన్ని నీళ్లు తాగినా ఎక్కిళ్ళు తగ్గేవి కావు. అయినా సరే, నీళ్లు తాగాల్సిందే, అదీ ఆగకుండా. 

                                                 వేసవికాలంలో ఒక్కోసారి బాగా వళ్ళు పేలేది. అప్పుడు మళ్ళీ సాన, గంధం చెక్క బయటకు తీసి, గంధం తీసి, ఆ గంధాన్ని చల్లగా ఒంటికి పూసేవాళ్ళు. అదే ఈ రోజు మాయిశ్చరైజర్ గా మారింది. కానీ గంధం ఉన్నంత హాయిగా మాయిశ్చరైజర్  ఉండదు. మా చెల్లెళ్ళిద్దరికీ ఎందుకో తెలియదు కానీ, ప్రతి వేసవిలో వాళ్ళిద్దరికీ తలలో, జుట్టు నిండా కురుపులు లేచేవి. చాలా బాధపడేవాళ్లు. అప్పుడు అమ్మ రోజూ ఫ్రెష్ గా, కృష్ణానది ఒడ్డు నుంచి ఒండ్రుమట్టి  తెప్పించేది. ఆ మట్టి తలకు పట్టించేది అమ్మ. చల్లగా హాయిగా ఉండేదట. కాకపోతే ఈ పుళ్ల వల్ల ప్రతి వేసవిలోనూ తప్పనిసరిగా వాళ్లిద్దరికీ జుట్టు కత్తిరించేది అమ్మ. అన్నిసార్లు కత్తిరించినందుకే కాబోలు, వాళ్ళిద్దరి జుట్లూ చక్కగా పొడుగ్గా పెరిగాయి. నాకేమో భుజాలు దాటి పెరగలేదు. పైగా జుట్టు సన్నగా స్పైరల్ లాగా అయిపోయి యెంత జుట్టున్నా కూడా స్ప్రింగులు తిరిగినట్టు భుజాలదాకా వెళ్లిపోయేది. ఎక్కడైనా పొడుగు జడ కనిపిస్తే, ఇప్పటికీ నేను చిన్నపిల్లలా వాళ్ళను, కాదు కాదు, వాళ్ళ జడను చూస్తూనే ఉంటా.

                                                    ఒకసారి నాకు చాలా చిన్నప్పుడు సుమారు మూడేళ్ళు ఉంటాయి అనుకుంటా, అప్పుడు చంటిబిడ్డ జబ్బు వచ్చిందట. ఇంతకీ చంటిబిడ్డ జబ్బు అంటే ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. బహుశా అది ఒక రకం ఫిట్ ఏమో అనుకుంటున్నా, వాళ్ళు చెప్పిన మాట బట్టీ. ఇంట్లో నాన్నా, ఎదురింట్లో ఉమా పెదనాన్నా అందరూ ఎక్కడికో బైటకు వెళ్లారు. మగవాళ్ళెవరూ లేరు. పక్కింట్లో వుండే ఆలోపతీ డాక్టర్, ఊళ్ళోనే జరుగుతున్న ఏదో డాక్టర్ల కాన్ఫరెన్స్ కి వెళ్ళాట్ట. నేనేమో పడిపోయానట. బామ్మ వెంటనే, ఎవర్నో మా హనుమానన్నయ్య కోసం పంపించింది. ఆయనా దొరకలేదు సమయానికి. హనుమానన్నయ్య ఆరోజుల్లో మా అందరికీ హోమియో డాక్టర్. బామ్మకి మేనకోడలు కొడుకు. అనుకోకుండా వాళ్ళూ నందివాడ వాళ్ళే. నాకు అన్నయ్య వరస. మా నాన్న కంటే పెద్ద, కానీ బామ్మ ని బామ్మా అనీ, నాన్నని బాబాయ్ అనీ పిలిచేవాడు. మేం అందరం అన్నయ్యా అనేవాళ్ళం. ఆయన మొత్తం విజయవాడలో పెద్ద పేరు తెచ్చుకున్న హోమియో వైద్యుడు. పూర్తి పేరు డాక్టర్ నందివాడ హనుమత్ సీతాపతిరావు. ఆయనుంటే, అందరికీ కొండంత ధైర్యం. ఆయన లేడనేసరికి నన్ను ఒళ్లో పెట్టుకుని అందరూ ఏడుస్తూ కూర్చున్నారుట. వీళ్ళ ఏడుపు విని ఎవరో రోడ్డు మీద పోతున్న వాళ్ళు లోపలికి వచ్చి, నన్ను చూసి, 'అయ్యో చంటిబిడ్డ జబ్బులా వుందే' అనుకుంటూ, అందులో ఒకాయన, తాను తాగుతున్న చుట్టతో  వెంటనే నా కనుబొమల మధ్య, కొంచం పైన, ఆజ్ఞాచక్రం అంటారే, అక్కడ ఒక వాత పెట్టాట్ట. ఆ మచ్చ నాకు ఇప్పటికీ వుంది, పెద్దవుతున్న కొద్దీ చాలావరకు చర్మంలో కలిసిపోయినా. ఆ వేడి చుట్ట నిప్పు తగలంగానే నేను లేచి కెవ్వున ఏడిచాట్ట. అందరూ వెంటనే ఆ చుట్టాయనకు దణ్ణం పెట్టి, 'బతికించారండీ దేవుడిలా వచ్చారు' అన్నారట. ఈ కథ నేను అమ్మ దగ్గరా, బామ్మ దగ్గరా ఎన్నిసార్లు విన్నానో. ఆ తరువాత నానా, పెదనాన్న, హనుమానన్నయ్యా అందరూ వచ్చారనుకోండి. కానీ అందరూ ఈ చుట్ట వాత వైద్యం మాత్రం మెచ్చుకున్నారు. ఈ రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ వస్తే, షాక్ ఇవ్వట్లా, అట్లా అన్నమాట. సో, చిట్టి  చిట్టి చిట్కాలు పోయే ప్రాణాలు కూడా రక్షిస్తాయి.

                                             ఇంకోసారి, ఈ వైద్యం బామ్మ చేసిందే. మేమందరం మా పెద్దత్తయ్యా వాళ్ళబ్బాయి విఠల్ వొడుక్కి హైదరాబాద్ వచ్చాం. పెద్దత్తయ్యా వాళ్ళింటికి, ఒడుగు జరిగే ప్రాంతానికీ ఓ గోడే అడ్డం. వెళ్తే ఆ గోడ దూకి వెళ్ళాలి, లేదా రోడ్డంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది జరిగింది జాంబాగ్ లో, వనపర్తి రాజా గారి బిల్డింగ్ లో. అందరం చాలా అలవాటుగా గోడ దూకేసి అటూ, ఇటూ వెళ్ళేవాళ్ళం. పైగా మా పిల్లలకు అదో ఆటలా ఉండేది. ఎక్కడానికీ, దూకటానికీ వీలుగా అటూ ఇటూ యేవో రాళ్లు కూడా పెట్టారు. మా తమ్ముడు, వాడికప్పుడు ఐదేళ్ళు ఉండొచ్చు. ఓ సారి అలా దూకుతూ, అంత ఎత్తు గోడ మీంచీ, కాలుజారి పడిపోయాడు. కంటి పక్కన నెమరుకణత మీద ఓ రాయి గుచ్చుకుని బొక్క పడి చాలా రక్తం పోయింది. బాధకి బాగా ఏడుస్తున్నాడు. అందరం భయానికి, వాడికేమి అవుతుందో అన్న ఖంగారుకీ భోరుభోరున ఏడ్చేస్తున్నాం. అందరం వాడిని లోపలికి తీసుకెళ్ళాము.  బామ్మ మాత్రం, ఏమాత్రం ఖంగారు పడకుండా, పిల్లాడిని  పడుకోబెట్టి, వంటింట్లోకి వెళ్లి, సున్నం బెల్లం కాస్త పసుపు వేసి మెత్తగా గట్టి పేస్ట్ లాగా నూరి, పట్టుకొచ్చి, బాబుకి ఆ బొక్కలో పెట్టేసింది. అంటే ఈ సున్నం బెల్లంతో  నూరిన పేస్ట్ తో ఆ బొక్కని సీల్ చేసేసింది. ఇక అంతే, టక్కున రక్తం కారటం ఆగింది. బాబు మామూలుగా లేచాడు. తరువాత బామ్మ చెప్పింది, యెంత పెద్ద దెబ్బయినా సున్నం బెల్లం నూరి పట్టు వేస్తే, చక్కగా తగ్గుతుందని. ఆ పేస్ట్, ఓ గంటకల్లా గట్టి పడిపోయింది. పూర్తిగా గాయం తగ్గాక కానీ అది ఊడి పడలేదు. దానంతట అదే పడిపోతుంది, పీకోద్దని వాడికి ఓ వార్నింగ్ ఇచ్చింది. సుమారు ఓ నెల రోజులకు ఆ వుండ ఊడి పడింది. అక్కడ ఓ చిన్న మచ్చ మాత్రం మిగిలింది. బామ్మ గృహవైద్యాలకు సాక్ష్యంగా నాకో మచ్చ, నా తమ్ముడికో మచ్ఛా మిగిలాయి. 

                                                        బామ్మ ఇంకొన్ని తమాషా చిట్కాలు చేసేది. ఇంట్లో వక్కపొడి ఎప్పుడైనా అయిపోతే, (మామూలుగా మాఇంట్లో వక్కపొడి అయిపోదు, ఎందుకంటే నాన్నకి అది చాలా ఇష్టం) అప్పటికప్పుడు ఓ చారెడు కందిపప్పు ఎర్రగా వేయించి అందరికీ చేతిలో పోసేది మా అమ్మ. ఈ చిట్కా మాత్రం బామ్మ చెప్పిందే. నాన్న కూడా ఇష్టంగా తినేవాడు, ఈ వేయించిన కందిపప్పు. అలాగే, ఎప్పుడైనా పళ్ళపొడి అయిపోతే బొగ్గుని గరుగ్గా పొడి చేసి, దానికి గరుగ్గా దంచిన ఉప్పుని జత కలిపి, ఇచ్చి పళ్ళు తోముకునేది. ఇది చెయ్యాలంటే మాత్రం మేమంతా ఘొల్లు ఘొల్లున ఏడ్చేవాళ్ళం. అయినా తప్పేది కాదు. అంతే కాదు, పొరపాటున ఎవరి పళ్లయినా పచ్చగా కనిపించాయీ అంటే,  వాళ్ళకీ ఇదే ట్రీటుమెంటు. తప్పేది కాదు. ఇప్పుడేమో పేరున్న విదేశీ కంపెనీలొచ్చి, మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, బొగ్గుందా, లవంగం ఉందా, అసలు పేస్టుందా, లాంటి తింగర ప్రశ్నలేస్తుంటే వింటున్నాం, చూస్తున్నాం. అదీ కథ. మళ్ళీ అందరూ, మన భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల ప్రజలందరూ మనలాగానే, నిజ్జంగా నిజం, అచ్చం మన లాగానే బొగ్గుతో, ఉప్పుతో పళ్ళు తోముకునే రోజులొచ్చేశాయి. నాకేమో "మారాయ్, మారాయ్, రోజులు మారాయ్" అని పాడుకోవాలని పిస్తోంది. 








కామెంట్‌లు

  1. I think all these home remedies were being followed in every house in those days. My Bamma,my mom used to follow these home remedies and later I have followed them.

    In my childhood we used to clean our teeth with " Kachika". We were having cows and buffaloes in those days. With cow dung pidakalu were made. And daily for boiling the milk, those pidakalu were used as fuel. And later the burnt out pidakalu were saved and used as tooth powder.

    రిప్లయితొలగించండి
  2. Maa attagaru kuda boledu chitkalu cheptaru, intlo pedda valu unte chala advantages... mana tension ni chala varaku cool chestaru

    Anni okkedagara baga pondhuparicharu aunty... epudaina doubt vasthe ikada chusi follow avachu🙂

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ